హైదరాబాద్ : తెరాసలో చేరినట్లు గతంలో ప్రకటించిన కాంగ్రెస్కు చెందిన పది మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. శాసన మండలిలో కాంగ్రెస్ పక్షాన్ని అధికార తెరాస విలీనం చేసుకోవడాన్ని ఆక్షేపిస్తూ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ దాఖలు చేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయ స్థానం విచారణ చేపట్టింది. మండలి చైర్మన్కు ఎలాంటి అధికారం లేకపోయినా కాంగ్రెస్ పక్షాన్ని తెరాసలో విలీనం చేశారని షబ్బీర్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన న్యాయ స్థానం మండలి చైర్మన్, కార్యదర్శి, ఎన్నికల సంఘంతో పాటు తెరాసలో విలీనమైన నలుగురు ఎమ్మెల్సీలు ఎంఎస్. ప్రభాకర రావు, దామోదర్ రెడ్డి, సంతోష్ కుమార్, ఆకుల లలితకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు గతంలో దాఖలు చేసిన మరో పిటిషన్పై కూడా న్యాయ స్థానం విచారణ చేపట్టింది. సీఎల్పీని విలీనం చేసుకోవాలని తెరాస ప్రయత్నిస్తోందని, ఒక వేళ అలాంటిదేమైనా ఉంటే ముందుగా తమకు నోటీసు ఇవ్వాలని స్పీకర్ను కోరినా స్పందించలేదని వారు పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు, ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, సురేందర్, హరిప్రియ, డి. సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలతో పాటు స్పీకర్, శాసన సభ కార్యదర్శి, ఎన్నికల కమిషన్కు నోటీసులు జారీ చేస్తూ, విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.