సౌథాంప్టన్ : ప్రపంచ కప్పులో ఇండియా బుధవారం తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ధోనీ మరీ విజృంభించి ప్రాక్టీస్ చేస్తున్నట్లు బీసీసీఐ ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది. ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియాను కూడా జత చేసి, అతని వీరబాదుడు గురించి వివరించింది. కేఎల్. రాహుల్ కూడా ప్రాక్టీసులో బాగా శ్రమిస్తున్నట్లు పేర్కొంది. మరో వైపు దక్షిణాఫ్రికా ఇప్పటికే ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమిపాలై డీలా పడింది. పేసర్ లుంగి ఎంగిడి గాయం కారణంగా భారత్తో మ్యాచ్ ఆడడం లేదు. అయినా భారత్తో కొత్త ప్రణాళికతో బరిలోకి దిగుతామని కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. కాగా ప్రపంచ కప్పులో భారత్పై దక్షిణాఫ్రికాకు మంచి రికార్డే ఉంది. ఇదివరకు ఇరు జట్లు నాలుగు సార్లు తలపడగా, మూడు సార్లు దక్షిణాఫ్రికా విజయం సాధించింది.