న్యూఢిల్లీ : కశ్మీర్ సమస్య పరిష్కారానికి కేంద్ర హోం మంత్రి చొరవ తీసుకుంటారని భావించడం మూర్ఖత్వమవుతుందని జమ్మూ -కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి మంగళవారం వ్యాఖ్యానించారు. కశ్మీర్ రాజకీయ సంక్షోభం సమసిపోయినపుడే సమస్య పరిష్కార మవుతుందని పేర్కొన్నారు. ‘1947 నుంచి కేంద్ర ప్రభుత్వాలన్నీ కశ్మీర్ను ఒక భద్రతా సమస్యగానే చూస్తున్నాయి.రాజకీయంగా సమస్యలు ముగిసిపోవాలంటే పాకిస్తాన్ సహా అన్ని రాజకీయ పార్టీలన్నీ ఇందులో భాగమైనపుడే ఒక ముగింపు వస్తుంది. ఇప్పుడున్న హోం మంత్రి ద్వారా కశ్మీర్ సమస్య పరిష్కారం సాధ్యమవుతుందని అనుకోవడం హాస్యాస్పదమే అవుతుంది’ అని ఆమె ట్వీట్ చేశారు.దీన్ని భాజపా లోక్సభ సభ్యుడు గౌతం గంభీర్ గర్హించారు. ‘చర్చల ద్వారా కశ్మీర్ సమస్య పరిష్కరానికి నాలాంటి వాళ్లు భావిస్తుంటే మెహబూబా ముఫ్తి మాత్రం అమిత్ షా విధానాలను ఎద్దేవా చేస్తున్నారు. సహనం వహించినందు వల్ల ఏం జరిగిందనేదానికి చరిత్రే సాక్ష్యం. ఒకవేళ అణచి వేతకు గురైన వారు నా ప్రజల భద్రతకు హామీ ఇవ్వగలిగితే వాళ్లు చెప్పినట్టే చేస్తామ’న్నారు. భాజపా కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే.. జమ్మూ-కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధీకరణను రద్దుచేస్తామని అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భరోసా ఇచ్చారు.