వివాదాస్పద అయోధ్య కేసుపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ఆధ్వర్యంలోని ఈ ధర్మాసనం జనవరి 10వ తేదీన అయోధ్య కేసుపై విచారణ జరపనుంది. ఈ ధర్మాసనంలోని మరో నలుగురు న్యాయమూర్తులు.. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్లు ఉన్నారు. ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతం గురించి దాఖలైన ఈ కేసు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు ప్రాంతంలో వివాదాస్పద 2.77ఎకరాల భూమిని నిర్మోహీ అఖారా, రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డులకు మూడు భాగాలుగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.