బెంగళూరు : ఐపీఎల్ ఈ సీజన్లో అంపైర్లు తరచూ వివాదానికి గురవుతున్నారు. తాజాగా ఓ అంపైర్ మతిమరుపు కాసేపు ఉత్కంఠ కలిగించడంతో పాటు హాస్యాన్ని కూడా పంచింది. ఆర్సీబీ, కింగ్స్ లెవన్ పంజాబ్ మధ్య బుధవారం రాత్రి ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరిగింది. పంజాబ్ బౌల్ చేస్తున్న సమయంలో 13వ ఓవర్ తర్వాత అంపైర్ శంషుద్దీన్ స్ట్రాటెజిక్ టైమ్ ఔట్ను ప్రకటించారు. విరామం అనంతరం పంజాబ్ బౌలర్ అంకిత్ రాజ్పుట్ బౌలింగ్ చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే బంతి కనిపించకపోవడంతో కెప్టెన్ అశ్విన్ అంపైర్ శంషుద్దీన్ను బంతి కోసం వాకబు చేశాడు. కాసేపు వెతుకలాట అనంతరం కొత్త బంతిని తీసుకు రావాల్సిందిగా అంపైర్ సిబ్బందికి సూచించాడు. కిట్తో వారు మైదానంలోకి ప్రవేశించారు. ఈలోగా థర్డ్ అంపైర్ పెద్ద తెరపై బంతి ఆచూకీ కోసం రీప్లే చేశాడు. ఇందులో బంతి శంషుద్దీన్ జేబులో ఉన్నట్లు తేలింది. దీంతో అతను తన జేబులో నుంచి బంతిని బయటకు తీయడంతో ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కాసేపు నవ్వుకున్నారు. తర్వాత కొత్త బంతులతో వచ్చిన సిబ్బందిని వెనక్కు పంపి, ఆటను కొనసాగించారు.