
పులివెందుల: మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షాల్ని తారుమారు చేసారనే ఆరోపణపై వివేకానంద రెడ్డి ప్రధాన అనచరుడు ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, పని మనిషి లక్ష్మి కుమారుడు ప్రకాశ్ను అరెస్టు చేసిన ట్లు పోలీసులు గురువారం ఇక్కడ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 15న ఉదయం స్నానాల గదిలో హత్యకు గురైన వివేకా మృత దేహాన్ని పడక గదికి తరలించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఉదయం దొరికిన లేఖను సాయంత్రం వరకు పోలీసులకు ఇవ్వనందుకు కృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్లు వివరించారు. స్నానాల గది నుంచి మృతదేహాన్ని పడక గదికి తరలించడం, రక్తపు మరకలు కడగడం, నుదుటిపై కట్లు కట్టి మృతదేహానికి బట్టలు మార్చడం తదితర వ్యవహారంలో ఎర్ర గంగిరెడ్డి పాత్ర ప్రధానంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పనిమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాశ్ రక్తపు మరకలు కడిగాడని పేర్కొన్నారు. సుమారు 12 రోజుల పాటు 50మందికి పైగా సాక్షులను పోలీసులు విచారించి కొందరిని అదుపులోనికి తీసుకున్నారు.