లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థిగా మరోసారి బరిలో దిగిన కేసీఆర్ తనయురాలు కల్వకుంట్ల కవిత తన విజయం నల్లేరు మీద నడకేనని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా పెద్ద సంఖ్యలో రైతులు కవితపై పోటీ చేయడానికి నామినేషన్లు దాఖలు చేయడంతో అధికార తెరాస పార్టీకి షాక్ తగిలింది.తమ పంటలకు మద్దతు ధర కల్పించాలంటూ ఎన్నిసార్లు విన్నవించినా ఎంపీ కవిత పట్టించుకోకపోవడంతో ఎన్నికల బరిలో దిగి కవితకు షాక్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు రైతులు తెలుపుతున్నారు.రైతుల పోటీ చేసే విషయం తెలుసుకున్న కేసీఆర్ మీ సమస్యలు తీర్చడానికి కృషి చేస్తామంటూ నిజామాబాద్ సభలో హామీ ఇచ్చినా రైతులు వెనక్కితగ్గ లేదు.తెరాస అభ్యర్థి కవిత ఒక అడుగు ముందుకేసి మీరు పోటీ చేయాలనుకుంటే ప్రధాని నరేంద్రమోదీపై పోటీ చేయాలంటూ సూచించింది.అయితే ఆ పొటీ ఏదో మీరే ప్రధాని మోదీపై చేయడంటూ కవితకు రివర్స్లో సలహాలు ఇచ్చిన రైతులు నామినేషన్లు దాఖలు చేశారు.నిజామాబాద్ నియోజకవర్గం నుంచి 200 మందికి పైగా రైతులు కవితకు ప్రత్యర్థులుగా బరిలో దిగనున్నారు.కవితకు పోటీగా 200 మంది రైతులు ప్రత్యర్థులుగా బరిలో దిగనుండడం తెరాస అధినేత కేసీఆర్ను కలవరపాటుకు గురి చేస్తోంది.ఎన్నికల్లో కవిత విజయానికి వచ్చిన ఇబ్బందేమి లేకపోయినా రైతులు నిరసనగళం విప్పడంతో కవితకు పోటీగా ఎన్నికల బరిలో నిల్చోవడానికి నిర్ణయించుకోవడం కేసీఆర్లో గుబులు రేపుతోంది.ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో నిజామాబాద్ నియోజకవర్గానికి ఈవీఎంలకు బదులు బ్యాలెట్ వాడాల్సి ఉంటుంది.అయితే 28వ నామినేషన్ల ఉపసంహరణ ఉండడంతో అప్పటివరకు ఎంతమంది నామినేషన్లు ఉపసంహరించుకుంటారో వేచి చూడాలి.ఒకవేళ ఏఒక్కరు కూడా నామినేషన్ వెనక్కి తీసుకోకపోతే ఓట్లు చీలడం తథ్యం.ఎంత మెజారిటీ వస్తే అంత బలమని నమ్మి ఎన్నికల్లో మెజారిటీకి ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్ నిజామాబాద్ ఎన్నికల్లో కూతురు కవిత మెజారిటీకి రైతులు ప్రతిబంధకంగా మారిన నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో మరి.కాగా నామినేషన్ల దాఖలు చివరిరోజు కావడంతో సోమవారం ఒక్కరోజే నిజామాబాద్ నియోజకవర్గానికి 245 నామినేషన్లు దాఖలు కాగా అందులో 182 మంది రైతులు ఉండడం గమనార్హం. సోమవారం కాంగ్రెస్,బీజేపీ అభ్యర్థులు మధుయాష్కి,అరవింద్లు నామినేషన్లు దాఖలు చేయగా మిగిలిన నామినేషన్ పత్రాలన్నీ రైతులవే.నామినేషన్లు దాఖలు చేసిన రైతుల్లో నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని జగిత్యాల,కోరుట్ల,బాల్కొండ,ఆర్మూర్ నియోజకవర్గాల రైతులే అధికంగా ఉండడం విశేషం.రైతులకు సంఘీభావంగా ఆయా ప్రాంతాల నేతలు కూడా తరలివచ్చారు.కేసీఆర్ కుటుంబ పాలన దొరలపాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని చెప్పడానికి ఇంతకన్నా రుజువులు అవసరం లేదంటూ కాంగ్రెస్,బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు..