తెలంగాణ రాష్ట్రం మొత్తం తెరాస ప్రభావం ఉన్నా హైదరాబాద్ నగరంలో మాత్రం ఎంఐఎం ప్రభావం ఉంటుంది.శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తంగా కారు జోరు చూపగా హైదరాబాద్లో మాత్రం ఎంఐఎం జోరు చూపించింది. శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్ సెగ్మెంట్లోని ఏడు నియోజకవర్గాలను ఎంఐఎం తన ఖాతాలో వేసుకుందంటూ ఓవైసీ సోదరులు హైదరాబాద్ను తమకు ఎలా కంచుకోటగా మార్చుకున్నారో స్పష్టమవుతోంది.ఇక ఎంఐఎం పార్టీ తరపున అన్న అసదుద్దిన్ ఓవైసీ హైదరాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేయగా తమ్ముడు అక్బరుద్దిన్ ఓవైసీ చాంద్రాయణగుట్ట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం పరిపాటి.2004 నుంచి గత లోక్సభ ఎన్నికల వరకు అసదుద్దిన్ హైదరాబాద్ ఎంపీగా బరిలో దిగుతూ విజయం సాధిస్తూ వస్తున్నారు.ఈ క్రమంలో వచ్చే నెలలో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ నియోజకవర్గం నుంచి అసదుద్దిన్ నామినేషన్ దాఖలు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా అదే నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా అసదుద్దిన్ తమ్ముడు అక్బురుద్దిన్ ఓవైసీ కూడా నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది.

దీంతో ఓవైసీ సోదరుల మధ్య సఖ్యత చెడిపోయిందని అందుకే ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయిజ.అయితే ఇద్దరు నామినేషన్ వేయడం వెనుక మరో కోణం దాగి ఉందని ఒకవేళ అసదుద్దిన్ నామినేషన్ తిరస్కారానికి గురైతే అక్బురుద్దిన్ ఎన్నికల్లో నిల్చుంటారనే ఉద్దేశంతో అసదుద్దిన్ నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజు అక్బరుద్దిన్ కూడా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.అసదుద్దిన్ నామినేషన్ ఆమోదం పొందగానే అక్బరుద్దిన్ తన నామినేషన్ ఉపసంహరించుకుంటారని సమాచారం.ఈసారి ఎన్నికల సంఘం నిబంధనల విషయంలో కఠినంగా ఉంటుండడంతో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది.శాసనసభ ఎన్నికల సమయంలో కూడా ఏడు మంది అభ్యర్థులతో పాటు బ్యాకప్ కోసం మరో ఏడు మంది అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించారు.ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే..