బుధవారం ఉదయం 09.30 గంటలకు హైదరాబాద్ నగరంలోని ఐటీ ఉద్యోగుల ప్రతీరోజూ ఎదుర్కొనే ట్రాఫిక్ తిప్పలకు శాశ్వతంగా శుభం కార్డు పడింది.అమీర్పేట-హైటెక్సిటీ మధ్య మెట్రోరైలును గవర్నర్ నరసింహన్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.మెట్రో రెండవ కారిడార్లో భాగంగా నాగోలు-ఉప్పల్-అమీర్పేట మీదుగా హైటెక్ సిటీ వరకు మెట్రో మార్గాన్ని నిర్మించారు.నాగోలు-అమీర్పేటల మధ్య గతంలోనే మెట్రో నిర్మాణ పనులు పూర్తి కాగా కొద్ది రోజుల క్రితం అమీర్పేట-హైటెక్ సిటీ మధ్య పది కిలోమీటర్ల మేర మెట్రో మార్గం నిర్మాణ పనులు పూర్తి కావడంతో నాగోలు-హైటక్ సిటీ మధ్య మెట్రోరైలు సంచారానికి గ్రీన్సిగ్నల్ లభించింది.ఈ క్రమంలో నాగోలు నుంచి హైటెక్ సిటీ వరకు ఒకే రైలులో ప్రయాణించె వెసులుబాటు కలిగింది.అయితే మియాపుర్ నుంచి హైటెక్ సిటీకి వెళ్లాల్సిన ప్రయాణికులు అమీర్పేటలో దిగి నాగోలు-హైటెక్ సిటీ మెట్రోరైలు ఎక్కాల్సి ఉంటుంది.అమీర్పేట నుంచి మధురానగర్,యూసుఫ్గూడ,జూబ్లిహిల్స్రోడ్ నంబర్ 5,జూబ్లిహిల్స్ చెక్పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపుర్,దుర్గంచెరువు స్టేషన్ల మీదుగా హైటెక్ సిటీ చేరుకుంటుంది. అయితే హైటెక్సిటీ-అమీర్పేట మార్గంలో మలుపులు ఎక్కువగా ఉన్న కారణంగా జూబ్లిహిల్స్ చెక్పోస్ట్,పెద్దమ్మగుడి, మాదాపుర స్టేషన్లలో మాత్రం ప్రస్తుతానికి మెట్రోరైలుకు స్టాపింగ్ ఇవ్వడం లేదని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.ఈ మూడు స్టేషన్లు ప్రారంభం కావడానికి మరికొన్ని వారాల సమయం పడుతుందన్నారు. ఇటు మియాపుర్ అటు నాగోల్ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి మెట్రోరైలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో సాధారణ ప్రజలకు అతిముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు చాలా లబ్ది చేకూరనుంది.ప్రతీరోజూ ట్రాఫిక్లో సర్కస్ ఫీట్లు చేస్తూ కార్యాలయాలకు చేరుకునే వేలాది మంది ఐటీ ఉద్యోగులు మెట్రోరైలులో ప్రయాణించడానికి మొగ్గు చూపే అవకాశం ఉండడంతో మెట్రోకు ఆదాయం భారీగానే ఉండే అవకాశం ఉంది..