తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటిన తెరాస త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో కూడా అదే జోరు కొనసాగించడానికి వ్యూహాలు సిద్ధం చేస్తోంది.ఎంపీ అభ్యర్థులపై ఆచితూచి వ్యవహరిస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్న కేసీఆర్ ఇప్పటికే ఆరు నియోజకవర్గాలకు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.మిగిలిన పది నియోజకవర్గాలకు కూడా అంతర్గతంగా చేయిస్తున్న సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడానికి కేసీఆర్ నిర్ణయించుకున్నారు.ఇక శాసనసభ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని పరితపిస్తోంది.ఈ క్రమంలో ఎనిమిది ఎంపీ నియోజకవర్గాలకు మొదటి అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.మొదటి జాబితాలో మాజీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి కూడా ఉన్నారు.మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి రేవంత్రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు.హైదరాబాద్ పరిధిలోనున్న ఎంపీ నియోజవర్గాల్లో మల్కాజ్గిరి ఎంతో కీలకమైన నియోజకవర్గం.గత ఎన్నికల్లో తెదేపా గెలుచుకున్న మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని ఎలాగైనా తెరాస వశం చేసుకోవడానికి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.అయితే కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించిన మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి రాజకీయ బద్దశత్రువు రేవంత్రెడ్డి బరిలో దిగనుండడంతో మల్కాజ్గిరిపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమికి లోక్సభ ఎన్నికల్లో బదులు తీర్చుకుంటానని మల్కాజ్గిరి నుంచి తెరాస అభ్యర్థిపై గెలిచి చూపిస్తానంటూ రేవంత్రెడ్డి శసథం చేయడంతో మల్కాజ్గిరి నియోజకవర్గం అభ్యర్థిపై కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.రేవంత్రెడ్డికి ధీటుగా నిలబడే అంగబలం,అర్థబలం పుష్కలంగా ఉన్న నేతను అభ్యర్థిగా బరిలో దించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.ఏమైనా మరోసారి కేసీఆర్,రేవంత్రెడ్డిల మధ్య మరోసారి రసవత్తరంగా జరుగనున్న ఎన్నికల పోరు కోసం రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ పోరులో కేసీఆరే మరోసారి పైచేయి సాధిస్తాడో లేక శాసనసభ ఎన్నికల్లో ఓటమికి రేవంత్రెడ్డి బదులు తీర్చుకుంటాడో మరో రెండు నెలల్లో తేలనుంది..