అట్టారీ (పంజాబ్): పాకిస్తాన్లోని కర్తార్పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్కు భారత యాత్రికుల సందర్శన గురించి అమృత్సర్ సమీపంలోని అట్టారీ సరిహద్దు వద్ద భారత్-పాకిస్తాన్ అధికారులు గురువారం తొలి సమావేశం ఆరంభమైంది. చర్చలు ప్రారంభమైనట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ట్విట్ చేసారు. ‘కల సాకారం కోసం కట్టుబడి ఉన్నామ’ని వ్యాఖ్యానించారు. అట్టారీ-వాఘా జాయింట్ చెక్పోస్టు గుండా పాకిస్తాన్ ప్రతినిధుల బృందం రాగానే చర్చలు ప్రారంభమయ్యాయి. అట్టారీ భారత్ వైపునున్న ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ (ఐసీపీ) వద్ద ఈ సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ సహా ఇతర విభాగాలకు చెందిన అధికారులు భారత్ తరపున, పాకిస్తాన్ కు చెందిన 18 మంది ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటున్నారు.‘ఈ సమావేశానికి, ద్వైపాక్షిక చర్చలకు సంబంధం లేద’ని భారత్ స్పష్టీకరించింది. ద్వైపాక్షిక చర్చల పునరుద్ధరణకు దీన్ని అవకాశంగా కూడా పరిగణించరాదని విదేశాంగ శాఖ ఇది వరకే తేట తెల్లం చేసింది. నేటికి సరిగ్గా నెల కిందట 40 మంది సీ ఆర్ పీఎఫ్ జవాన్లు పుల్వామా ఉగ్ర దాడికి బలి కావటం ఇక్కడ ప్రస్తావనార్హం.