పోలింగ్ శాతం పెంపునకు మోదీ వినతి

పోలింగ్ శాతం పెంపునకు మోదీ వినతి

దిల్లీ: ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగేలా  చూడాలని రాజకీయ, సినీ, క్రీడా , మాధ్యమాల ప్రముఖులకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పశ్చిమ్‌బంగా, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్య మంత్రులు మమతా బెనర్జీ, కేసీఆర్‌, చంద్ర బాబు నాయుడు తదితరులకు ట్వీట్‌లో ఈ మేరకు  పేరు పేరునా విన్నవించారు. ‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేలా ఓటర్లను ప్రోత్సహించాలని రాహుల్‌గాంధీ, మమతాబెనర్జీ, శరద్‌ పవార్‌, మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, స్టాలిన్‌ తదితరులను కోరుతున్నా. దేశవ్యాప్తంగా ఓటరు అవగా హన కార్యక్రమాలను పెంచాలి. రాష్ట్రాల్లో పోలింగ్‌ బూత్‌లకు ఎక్కువ మంది వచ్చేలా కృషి చేయాలని కేసీఆర్‌, నవీన్‌ పట్నాయక్‌, కుమారస్వామి, చంద్రబాబు, జగన్‌, నితీశ్‌ కుమార్‌ తది తరులను కోరుతున్నా’ అని పేర్కొన్నారు.  ‘మోహన్‌లాల్‌, నాగార్జున గారు.. మీ ప్రదర్శనలతో కోట్ల మంది అభిమానులను ఆనంద పరుస్తున్నారు. ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. మీ లాంటి వారు ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని కోరారు. షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌, క్రీడా ప్రముఖులు సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, అనిల్‌ కుంబ్లే, క్రికెటర్లు ధోనీ, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, ఫోగట్‌ సోదరీమణులు గీతా, బబిత, విన్నేశ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు దీపికా పదుకొణె, ఆలియా భట్‌, అనుష్క శర్మ, అక్షయ్‌ కుమార్‌, సల్మాన్‌ఖాన్‌, ఆమీర్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, షారూక్ ఖాన్‌, కరణ్‌ జోహార్‌ తదితరులను అభ్యర్థించారు. ‘ప్రజాస్వామ్య దేశంలో మాధ్యమ   సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజల ఆలోచనలపై మాధ్యమాలు  పెను ప్రభావం చూపుతోంది.  అలాంటి  సంస్థలు ఓటు హక్కుపై విస్తృత ప్రచారం కల్పించాల’ని  కోరారు. ‘ప్రజల ఆకాంక్షలకు మీరు అక్షర రూపాన్ని ఇస్తారు. అలాగే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా వారిలో స్ఫూర్తి నింపండి’ అని విన్నవించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos