దిల్లీ: అయోధ్యలో రామ జన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాద పరిష్కారానికి మధ్యవర్తిని నియమించాలా? వద్దా? అనే విషయమైమార్చి 5న నిర్ణయాన్ని తీసుకుంటామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం వెల్లడించింది. ‘స్నేహపూర్వక పరిష్కారానికి ఒక శాతం అవకాశం ఉన్నా దాని కోసం ప్రయత్నం చేయాలి. ఉభయ పక్షాలకు సమ న్యాయం జరగాలి. మేము ఈ విషయంపై తీవ్రంగా పరిశీలిస్తున్నాం. ఈ ప్రక్రియ మొత్తం అత్యంత గోప్యంగా ఉండాలి. వివాదం గత కొన్నేళ్లుగా కొనసాగుతుంటే మీరు గంభీరంగా పరిగణించరా? మేం స్థలం హక్కుల గురించి మాత్రమే నిర్ణయం తీసుకోగలం.’ అని ధర్మాసనం పేర్కొంది.మంగళ వారం నుంచి వ్యాజ్యంపై విచారణ ప్రారంభమైంది. మధ్యవర్తిని నియమించిదలచినట్లు గతంలో అత్యున్నత న్యాయస్థానం ఒక దశలో ప్రస్తావించినపుడు ఫిర్యాదీల్లో కొందరు వ్యతిరేకించారు. గతంలో మధ్యవర్తి జోక్యం చేసుకున్నా ప్రయోజనం చేకూరలేదని హిందూ పార్టీలు పేర్కొన్నాయి. మధ్యవర్తి నియమాకాన్ని హిందూ పార్టీ రామ్లల్లా తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వ్యతిరేకించారు .వివాదాస్పద స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలను వ్యాజ్యదారులకు ఆరు వారాల్లోగా అందించాలని కోర్టు రిజిస్ట్రీని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. అన్ని పార్టీలు ఈ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అభ్యంతరాలను తెలిపేందుకు ఎనిమిది నుంచి పన్నెండు వారాల సమయం పడుతుందని ముస్లిం సంస్థల తరపు న్యాయవాది ధావన్ ధర్మాసనం ప్రశ్నకు సమాధానగా తెలిపారు. దరిమిలా పత్రాలపై విచారణను ఎనిమిది వారాల తర్వాత చేపడతామని పేర్కొంది. ఈలోగా కక్షిదార్లు తమ అభ్యంతరాలను తెలపాలని కోరింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్లల్లా మధ్య సమానంగా పంపిణీ చేయాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వ్యక్తులు, ధార్మిక సంస్థల తరఫున 14 వ్యాజ్యాలు దాఖలయ్యాయి.