న్యూఢిల్లీ: కొన్ని మోడళ్ల ధరలను రూ.10,000 వరకు పెంచినట్టు మారుతీ సుజుకీ తెలిపింది. కమోడిటీ ధరల్లో పెరుగుదల, విదేశీ మారక రేట్లలో మార్పుల కారణంగా ధరలను పెంచాల్సి వచ్చినట్టు పేర్కొంది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. మోడల్ను బట్టి ధరల పెరుగుదల ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇటీవల విడుదల చేసిన కొత్త ఎర్టిగా మినహా మిగతా మోడళ్ల ధరలు పెరగడానికి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మారుతీ సుజుకీ ఎంట్రీ లెవల్లో ఆల్టో 800 నుంచి ప్రీమియం క్రాసోవర్ ఎస్-క్రాస్ వరకు వివిధ మోడళ్లను విక్రయిస్తోంది. ధరలను పెంచడానికి ముందు వీటి ధరల శ్రేణి రూ.2.53 లక్షల నుంచి రూ.11.45 లక్షల వరకు (ఎక్స్షోరూమ్, ఢిల్లీ) ఉంది. జనవరిలో కార్ల ధరలను పెంచనున్నట్టు డిసెంబరులోనే మారుతీ ప్రకటించింది. అయితే ఎంత మొత్తం పెంచే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.