వూజెన్ (చైనా): పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉద్రవాదానికి ముకుదాడు వేయాలని ఆ దేశానికి లెక్కలేనన్ని సార్లు విన్నవించినా, హెచ్చరించినా ప్రయోజనం లేకుండా పోయిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ జరిగిన రష్యా-ఇండియా-చైనా విదేశాంగ వ్యవహారాల మంత్రులు త్రైపాక్షిక భేటీలో సుష్మాస్వరాజ్ పాల్గొన్నారు. చైనా, రష్యా విదేశాంగ వ్యవహారాల మంత్రులు వాంగ్యీ, సెర్జీ లవ్రోవ్తో విడి విడిగాచర్చించారు. పుల్వామా ఉగ్రదాడిని చైనా విదేశాంగ మంత్రితో ప్రస్తావించిన ఆమె జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు పాకిస్తాన్ సాయం చేస్తోందని తప్పుబట్టారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు మరింత దిగజారి పోకుండా నివారించటానికి మెరుపు దాడులు అనివార్యమయ్యాయనితమ చర్యను సమర్థించు కున్నారు. చిరకాలంగా భారత్ సంమయమనాన్ని పాటిస్తూ బాధ్యతతో నడుచుకుంటోందని చెప్పారు. పాక్ స్థావరంగా పనిచేస్తున్న ఉగ్ర వాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరించినా అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఓ విధంగా ప్రోత్సహించిందనీ ఆరోపించారు. పైగా దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ బుకాయిస్తూ వచ్చారన్నారు. పుల్వామా దాడికి పాకిస్థాన్ స్థావరంగా పని చేస్తున్న జై షే మొహ్మద్ సంస్థ బాధ్యత వహించిందన్నారు. జై షే మొహ్మద్ ఉగ్ర సంస్థ భారత్లో మరిన్ని దాడులకు కుట్ర పన్నుతోందని సమాచారం అందిందన్నారు. ఆత్మరక్షణలో భాగంగానే ముందస్తు దాడులు చేయాల్సి వచ్చిందన్నారు. జై షే మొహ్మద్ ఉగ్రనేత మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు చైనా నిరాకరించటం ఇక్కడ ప్రస్తావనార్హం. దరిమిలా సుష్మా స్వరాజ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాల పురోభివృద్ధిపైనా చర్చ సాగింది. భారత్-చైనా మధ్య ముఖ్యమైన సంబంధాలు ఉన్నాయన్నారు. 2018 ఏప్రిల్లో భారత ప్రధాని, చైనా అధ్యక్షుడి సమావేశంతో రెండు దేశాల మధ్య సంబంధం మరింత బలోపేతమైంద న్నారు.