న్యూఢిల్లీ : బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన పాలనలో ఏనుగు విగ్రహాల నిర్మాణానికి ఖర్చు చేసిన ప్రజాధనాన్ని తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది . తన పార్టీ ప్రచారం కోసం మాయావతి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసారని ఉత్తర ప్రదేశ్ కు చెందిన న్యాయవాదిఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం పిటిషన్ విచారణ సందర్భంగా…‘ ప్రజా ధనాన్ని ఉపయోగించి మాయవతి తన పార్టీ గుర్తు, తన విగ్రహాలను ఆవిష్కరించారు. కాబట్టి రాష్ట్ర ఖజానాలో ఈ సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది’ అని సీజేఐ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 2న ఈ కేసు తుది విచారణ జరుగనుందని దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తెలిపింది.