రహదారులపై నిబంధనలను ఉల్లంఘిస్తూ జరిమానాలను తప్పించుకునేందుకు వాహనాల నంబరు ప్లేట్లను వంచేస్తున్న చోదకులపై పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు జరిమానాలతో సరిపెట్టిన పోలీసులు బుధవారం (నేడు) నుంచి కేసు నమోదుతో పాటుగా కోర్టులో అభియోగ పత్రాలు సమర్పించనున్నారు. కొందరు వాహనాల నంబరు పేట్లను ఒకవైపు వంచేసి సరిగా కనిపించకుండా నడుపుతున్నారు. ఈ వైనాన్ని గమనించిన పోలీసులు కొద్దినెలలుగా ప్రత్యేక డ్రైవ్లు చేపట్టి ఇలాంటి వారికి జరిమానా విధిస్తున్నారు. రెండు, మూడు నెలలుగా ఈ తరహా ఉల్లంఘనుల సంఖ్య పెరుగుతుండటంతో.. వారిని శిక్షించేందుకు అభియోగపత్రాలను తెరపైకి తెచ్చారు. దీంతో వాహన చోదకులు తప్పనిసరిగా కోర్టులో హాజరుకావాలి. అక్కడ జరిమానా చెల్లించి వాహనాన్ని తీసుకోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
