దిల్లీ: ఈ ఏడాది తొలి నెలలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రూ. లక్ష కోట్లు దాటాయి. 2018 డిసెంబరులో జీఎస్టీ వసూళ్లు రూ. 94,725 కోట్లుగా ఉండగా.. గత నెలలో ఇవి రూ. 1.02లక్షల కోట్లకు పెరిగాయి. 2018 జనవరిలో వసూలైన రూ. 89,825కోట్ల జీఎస్టీతో పోలిస్తే ఇది 14శాతం ఎక్కువ.ఇక ఈ ఏడాది జనవరి 31 నాటికి రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 73.3లక్షలకు చేరింది. ‘2019 జనవరిలో జీఎన్టీ వసూళ్లు రూ. 1,02,503కోట్లుగా ఉన్నాయి. ఇందులో కేంద్ర జీఎస్టీ రూ. 17,763కోట్లు కాగా.. రాష్ట్ర జీఎస్టీ రూ. 24,826కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 51,225కోట్లు, సెస్ రూ. 8,690కోట్లుగా ఉంది’ అని ఆర్థికశాఖ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.2017 జులై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత వసూళ్లు రూ. లక్ష కోట్ల మైలురాయిని దాటడం ఇది మూడోసారి. గతేడాది ఏప్రిల్, అక్టోబరులోనూ వసూళ్లు లక్ష కోట్లు దాటాయి. 2018 ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రూ. 1.03లక్షల కోట్లుగా ఉండగా.. అక్టోబరులో రూ. 1,00,710 కోట్లు జీఎస్టీ కింద వసూలయ్యాయి. కాగా.. ఏప్రిల్ తర్వాత అత్యధిక జీఎస్టీ వసూలవడం మళ్లీ ఇప్పుడే.