పట్నా: మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధాని అవుతారని ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ ఎన్డీయేలో కీలక నేత అయినప్పటికీ ప్రధానమంత్రి రేసులో ఉండరన్నారు. భాజపాకు పూర్తి మెజార్టీ రానప్పటికీ నితీశ్ అభ్యర్థిత్వం సాధ్యం కాకపోవచ్చునన్నారు. ‘‘నితీశ్ కుమార్ ఎన్డీయేలో ఒక పెద్ద నేత. బిహార్ లాంటి రాష్ట్రాన్ని 15 ఏళ్ల పాటు పాలించిన ఘనత ఆయనకు ఉంది. అయితే ప్రధాని స్థానంలో ఇప్పుడే ఆయనను ఊహించుకోవడం సమంజసం కాదు. నరేంద్ర మోదీయే ఎన్డీయే ప్రధాని అభ్యర్థి. రానున్న ఎన్నికల్లో గెలిచి.. మోదీ తిరిగి ప్రధాని పదవి చేపడతారు’’ అని ప్రశాంత్ వివరించారు.