లాహోర్ : దేశాన్ని వదిలివెళుతున్నారన్న కారణంగా పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత యూసఫ్ రజా గిలానీని మంగళవారం రాత్రి లాహోర్ విమానాశ్రయంలో భద్రతాదళ అధికారులు అడ్డగించారు. బ్యాంకాక్, దక్షిణ కొరియాలో ఒక సమావేశానికి హాజరు అయే్య్యేందుకు అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఆయనను అడ్డుకున్నట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఎ) తెలిపింది. ప్రయాణీకుల జాబితాలో గిలానీ పేరు లేదని పేర్కొంది. దేశాన్ని విడిచి పెట్టి వెళ్లేందుకు వీలు లేకుండా తన పేరును బ్లాక్ లిస్టులో ఉంచారని ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద గిలానీ ఆరోపించారు. తనపై నమోదైన వివిధ కేసుల్లో ఎప్పటికప్పుడు కోర్టులో హాజరవుతున్నాన న్నారు. దేశం నుంచి పారిపోవడం లేదని, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడమే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రధాన ఎజెండా అని దుయ్యబట్టారు. తన పేరును బ్లాక్ లిస్ట్లో ఉంచినట్లు పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పిటిఐ) ప్రభుత్వం తనకు సమాచారమివ్వాలని, ఈ అక్రమమైన నిర్ణయాన్ని సవాలు చేస్తానని అన్నారు. గిలానీపై అనేక అవినీతి కేసులు ఉన్నాయి. ఈ కేసులో తాను వ్యకిగతంగా హాజరు కాకుండా అనుమతినివ్వాలని దాఖలు చేసుకున్న పిటిషన్ను గత వారంలో ఇస్లామాబాద్లోని కోర్టు తోసిపుచ్చింది.