ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారమంతా అవినీతి, ఆర్భాటం, ప్రచారం తప్ప రాష్ర్టానికి చేసింది శూన్యమని, వీటిని వివరించటానికి వారానికో కేంద్రమంత్రి రాష్ట్రానికి రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. గుంటూరులో వారు ఆదివారం మీడియాతో మాట్లాడారు. సోమవారం కేంద్రమంత్రి గడ్కరీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని వారు చెప్పారు. ఉదయం విజయవాడలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అనంతరం మధ్యాహ్నం ఆకివీడులో పలు పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు వెల్లడించారు. ఒక్క గడ్కరీ మంత్రిత్వశాఖ నుంచే రూ.3లక్షల కోట్లు ఏపీకి వచ్చాయన్నారు. చంద్రబాబు నిత్యం కేంద్రంపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. మోదీ తిరిగి ప్రధాని అయితే జైలుకు పోవాలనే భయంతో దొంగలంతా ఓ చోటకు చేరారని వారు ఆరోపించారు. టీడీపీకి భయపడే ప్రధాని పర్యటన వాయిదా వేసుకున్నారనే ప్రగల్భాలను చంద్రబాబు మానుకోవాలని, అదే జరిగితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదని జీవీఎల్ హెచ్చరించారు. 23 మంది ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.