ఇస్లామాబాద్: భారత్ చేసిన మెరుపు దాడులకు గట్టిగా బదులిస్తామని పాక్ హెచ్చరించింది. మెరుపు దాడుల్ని తీవ్రంగా ఖండించింది. మెరుపు దాడుల గురించి పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్సీ)తో మెరుపు దాడుల గురించి మంగళ వారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘బాలాకోట్ సమీపంలో ఉగ్రవాద స్థావరాలంటూ భారత్ చేసిన దాడులను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోసారి భారత్ కట్టు కథలు చెబుతూ నిర్ల్యక్షంగా వ్యవహరించింది. ఆ దేశ ఎన్నికల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని భారత్ ఈ విధమైన చర్యకు దిగింది. భారత్ బాధ్యతా రహిత చర్యను ప్రపంచ నేతల ఎదుట ఎండగట్టాలని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయించారు. త్వరలో తీసుకోబోయే అన్ని చర్యలకు సంసిద్ధంగా ఉండాలని సైన్యం, దేశ ప్రజల్ని ఆయన కోరినట్లు తెలిపింది.భారత్ కాల్పుల ఉల్లంఘన విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తాలని పాక్ భావిస్తుంది.