న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 3.3 శాతంగా నిర్దేశించుకున్న ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోవడం సవాలుగానే కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. వస్తుసేవల పన్ను (జీఎ్సటీ) వసూళ్లలో తగ్గుదల, వ్యయాల్లో వృద్ధి, పారిశ్రామిక ఉత్పాదకతలో మందగమనం వంటి పరిణామాలు ప్రభుత్వానికి సవాలుగా మారినట్టు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక ప్రకటనలను ప్రభుత్వం చేయడం వల్ల లక్ష్యసాధన మరింత ఇబ్బందికరంగా మారనుందని కూడా అంటున్నారు. తాజా పరిణామాలను పరిశీలిస్తున్న కొంత మంది విశ్లేషకులు ప్రసుతత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతానికి కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నవంబరు చివరినాటికి ప్రభుత్వ అంచనాలో ద్రవ్యలోటు 114.8 శాతానికి చేరుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు జీడీపీలో రూ.6.24 లక్షల కోట్లు (3.3 శాతం) ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. జీఎ్సటీ వసూళ్లలో తగ్గుదల, ఎక్సైజ్ సుంకం వసూళ్లు తక్కువగా ఉండటం, పెట్టుబడుల ఉపసంహరణతో వచ్చే మొత్తం లక్ష్యానికన్నా తక్కువగా ఉన్నందు వల్ల ద్రవ్య లోటు 3.4 శాతానికి పెరగవచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ (సావరిన్ రిస్క్ గ్రూప్) విలియం ఫోస్టర్ అంటున్నారు. వ్యవసాయ రుణ మాఫీలు లేదా ఇతర సబ్సిడీలవల్ల ప్రభుత్వ వ్యయాలు పెరుగుతున్నాయని చెప్పారు.