న్యూఢిల్లీ: వివాదాస్పద రాఫెల్ డీల్కు సంబంధించిన ఫైళ్లు తన వద్దే ఉంచుకున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్పై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారంనాడు ఓ ట్వీట్లో డిమాండ్ చేశారు. ‘రాఫెల్పై గోవా ఆడియో టేపులు విడుదల చేసి 30 రోజులైంది. దీనిపై ఎఫ్ఐర్ నమోదు చేయడం కానీ దర్యాప్తునకు ఆదేశించడం కానీ ఇంతవరకూ జరగలేదు. మంత్రిపై ఎలాంటి చర్యలూ లేవు. అవి అసలైన టేపులే. ఆ టేపులతో రాఫెల్ సీక్రెట్లు బయటపడతాయి. ఆ టేపులు కలిగి ఉండటం వల్లే పారికర్కు పీఎంపై అధిపత్యం వస్తుంది’ అని ఆ ట్వీట్లో రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ డీల్కు సంబంధించిన అన్ని ఫైళ్లూ గోవా సీఎం మనోహర్ పారికర్ దగ్గరే ఉన్నట్టు చెబుతున్న ఓ ఆడియో క్లిప్ను కాంగ్రెస్ పార్టీ ఈనెల మొదట్లో విడుదల చేసింది. ఈ డీల్కు సంబంధించి గోవా మంత్రి విశ్వజిత్ రాణే మరో వ్యక్తితో మాట్లాడిన టేప్ ఇదని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. 2016లో ఇండియా-ఫ్రాన్స్ మధ్య రాఫెల్ డీల్పై సంతకాలు జరిగినప్పుడు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పారికర్ ఉన్నారని, ఆయన బెడ్రూంలోనే ఇందుకు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయని రాణే చెప్పినట్టు ఆ టేప్లో ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే, ఆ ఆరోపణలను రాణే ఖండించారు. కాంగ్రెస్ టేపు నకిలీదని, రాఫెల్ డీల్ గురించి కానీ, డాక్యుమెంట్ల గురించి కానీ పారికర్ ఎలాంటి ప్రస్తావన చేయలేదని రాణే వివరణ ఇచ్చారు.