దిల్లీ: రఫెల్ ఒప్పందంపై శుక్రవారం లోక్సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది ఈ ఒప్పందంపై రక్షణశాఖకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి కార్యాలయం ఫ్రాన్స్తో సమాంతరంగా చర్చలు జరిపిందంటూ ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. ఈ కథనాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్ష ఎంపీలు కేంద్రంపై ధ్వజమెత్తారు. రఫేల్పై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలను రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ అదే స్థాయిలో తిప్పికొట్టారు. . కాంగ్రెస్ సభ్యుల నిరసలన మధ్యే ఇదే అంశంపై రక్షణమంత్రి నిర్మలా వివరణ ఇచ్చారు. రఫేల్పై తాము చెప్పాల్సిందంతా చెప్పేశామని, ఇంకా మాట్లాడటం సమయం వృథా అని అన్నారు.‘రఫేల్ ఒప్పందంపై మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. పీఎంవో సమీక్షను జోక్యం చేసుకోవడం అని చెప్పలేం. కాంగ్రెస్ పార్టీకి దేశ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండటం ఇష్టంలేదన్న ఆమె… రఫెల్ ఒప్పందంపై రాహుల్ గాంధీ ఆరోపణలు అవాస్తవమన్నారు మల్టీ నేషనల్ కంపెనీల కోసమే రఫెల్ ఒప్పందంపై ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లో ప్రతిపక్షం కీలుబొమ్మలా మారిందని ఎద్దేవా చేశారు. రక్షణశాఖ నివేదికకు అప్పటి రక్షణమంత్రి మనోహర్ పారికర్ వివరణ ఇచ్చారు. దాని గురించి మీడియా ఎక్కడా చెప్పలేదు. ఒప్పందం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతా సవ్యంగా జరిగింది. దీనిపై మేం ఇటు పార్లమెంట్లోనూ అటు కోర్టులోనూ స్పష్టతనిచ్చాం. కాంగ్రెస్ కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని, సైన్యం, వైమానిక దళాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. ఇది చాలా ప్రమాదకరమన్నారు.