ఇస్లామాబాద్ : భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే 72 గంటలు అత్యంత కీలకమని పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వ్యాఖ్యానించారు. యుద్ధమా, శాంతా అనేది వచ్చే 72 గంటల్లో తేలిపోతుందని స్పష్టీకరించారు. ఒక వేళ యుద్ధం సంభవిస్తే అది రెండో ప్రపంచ యుద్ధం కంటే పెద్దదిగా మారే అవకాశం ఉంద న్నారు. భారత్-పాక్ మధ్య ఇదే అంతిమ యుద్ధం కావచ్చని అభిప్రాయపడ్డారు. ‘ఇదే భారత్కు చాలా స్పష్టమైన, గట్టి హెచ్చరిక. మా దేశాన్ని నాశనం చేయాలని చూస్తే.. దారుణ పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుంది. మేం తల్చుకుంటే మీ దేశంలో గడ్డి పరక కూడా మొలవదు.. పక్షులు కిచకిచలాడవు.. మీ ఆలయాల్లో గంటల కూడా మోగవు’ అని అన్నారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం భారత వాయుసేన ఉగ్రవాద శిభిరాలే లక్ష్యంగా జరిపిన మెరుపు దాడులకు దీటుగా పాక్ భారత్పై దాడులకు ప్రయత్నించింది. ఈ దాడులను భారత భద్రతా బలగాలు తిప్పికొట్టడంతో తోక ముడిచిన పాక్ సైన్యం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.