ఆంధ్రప్రదేశ్కు వెళ్లి బీసీలకు నాయకత్వం వహిస్తానని తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆ ప్రాంతం నుంచి తనను చాలా మంది ఆహ్వానిస్తున్నారని చెప్పారు. ఏపీలో బీసీలను ఏకం చేసేందుకు తన వద్ద మంచి ఆయుధాలు ఉన్నాయన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఏపీలో ఒక్కశాతం ఓట్లనైనా ప్రభావితం చేస్తానని తలసాని స్పష్టం చేశారు.
ఆలపాటి రాజేంద్రప్రసాద్ నియోజకవర్గంలో 25వేల యాదవుల ఓట్లు ఉన్నాయని, ఆయన్ను ఓడించడానికి ఆ ఓట్లు చాలని పేర్కొన్నారు. బాలకృష్ణ, ఆలపాటి వచ్చి తన నియోజకవర్గంలో ఏమీ చేయలేకపోయారని దుయ్యబట్టారు. తాను ఒక్కడిని ఏపీకి వెళితేనే తెదేపా నేతలు వణికిపోతున్నారని, కేసీఆర్ వెళితే ఇంకెంత భయపడతారోనని అన్నారు. తెలంగాణలో బీసీలకు రాజ్యసభ సీట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు బీసీలకు న్యాయం జరిగిందని..చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేదన్నారు. జగన్, కేసీఆర్ కలవటం వల్ల వైకాపాకు నష్టం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో వచ్చినట్టు భారీ మెజార్టీలు ఏపీలో రావని, వందల ఓట్ల తేడాతో నేతల జాతకాలు మారిపోతాయన్నారు.