న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి
వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం తీసుకునే అన్ని రకాల చర్యల్ని గట్టిగా సమర్థిస్తామని,
అండగా నిలబడుతామని ప్రతిపక్షాలు భరోసా ఇచ్చాయి. ఉగ్రవాదంపై పోరులో భద్రతా బలగాలకు విపక్షాలు సంఘీభావం
తెలిపాయి. దేశ సమైక్యత, సమగ్రతకు కాపాడేందుకు కట్టుబడినట్లు ప్రతినబూనాయి.
పుల్వామాలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో శనివారంనాడిక్కడ పార్లమెంటు హాలులో హోంమంత్రి
రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్ష సమావశం జరిగింది. ఉగ్రవాదంపై పోరును
సమష్టిగా ఎదుర్కొంటామంటూ తీర్మానం చేశారు.
ఇవీ
తీర్మానాలు.
‘పుల్వామాలో ఈనెల 14న 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న ఉగ్రదాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశ ప్రజలందరితో కలిసి బాధిత కుటుంబాకు అండగా నిలుస్తాం. సరిహద్దు కావల నుంచి అందుతున్న ఉగ్రవాద మద్దతుతో సహా ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా దానిని సమష్టిగా వ్యతిరేకిస్తున్నాం’ అని పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదం బెడదను ఇండియా ఎదుర్కొంటోందని, సరిహద్దు కావల ఉన్న బలగాలు ఇండియాలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో ఇప్పుడు చాలా చురుకుగా వ్యవహరిస్తున్నాయని అక్షేపించింది. ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో ఇండియా దృఢ చిత్తంతో వ్యవహరిస్తుంది. ఉగ్రవాదంపై పోరులో మన భద్రతా బలగాలకు సమష్టిగా ఈ రోజు సంఘీ భావం తెలుపుతున్నాం. దేశ ఐక్యత, సమగ్రతకు కట్టుబడి ఉంటాం’ అని స్పష్టీకరించింది. సమావేశంలో ఎన్సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆడాద్, ఆనంద్ శర్మ, కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ రామ్ విలాస్ పాశ్వాన్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నేరంద్ర సింగ్ తోమర్, తదితర నేతలు పాల్గొన్నారు.
మోదీ గైర్హాజరుకు విపక్షాల ఖండన
ప్రధాని
నరేంద్ర మోదీపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. కీలకమైన అఖిలపక్ష సమావేశానికి
గైర్హాజరు ను విపక్షాలు తీవ్రంగా ఆక్షేపించాయి.తమ అభిప్రాయాలను ప్రధానితోనే
పంచుకుంటామని, మోదీతో ఖచ్చితంగా సమావేశం ఏర్పాటు చేయాలని పలువురు నేతలు
స్పష్టంచేశారు. ఉగ్రవాద పోరుపై ప్రధాని హోదాలో మోదీ తీసుకున్న చర్యలేమిటో
తెలపాలని డిమాండ్ చేశారు. మోదీ వైఖరికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర అసహనం
వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు తగిన బుద్ధి చెబుతామని పార్టీ బహిరంగ సభల్లో
ఊదరగొట్టే మోదీ.. ఉగ్రవాదాన్ని అణచడంలో ఇనాళ్లు ఏం చేశారో
తెలపాలని డిమాండ్ చేశారు. కేవలం మాటలే తప్ప మోదీ సాధించింది ఏమీ లేదని ఎద్దేవా
చేసారు.
పాత
తీర్మానాలకు పాతర? శివసేన
పాకిస్థాన్పై తక్షణ
చర్యలు తీసుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని శివసేన డిమాండ్ చేసింది. పఠాన్కోట్,
ఉరి దాడుల సమయంలోనూ ఇలాంటి తీర్మానాలే చేశామని గుర్తు చేసింది. అఖిలపక్ష
సమావేశానంతం శివసేన నేత సంజయ్ రౌత్ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. “పాకిస్థాన్కు
బుద్ధి చెప్పేందుకు ప్రభుత్వానికి పూర్తి మద్దతిస్తున్నట్టు తీర్మానాన్ని ఆమోదించాం.
పఠాన్కోట్, ఉరి దాడుల సమయంలోనూ ఇలాంటి తీర్మానాలే చేశాం, తీర్మానాలు చేయడం మంచిదే.
వాటిని ఇప్పుడు అమలు చేయాలని కోరినట్లు రౌత్ తెలిపారు.
.ఉగ్రవాదం అంతానికి కాంగ్రెస్ పట్టు
పుల్వామా ఉగ్రదాడిపై
చర్చించేందుకు జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయాలని
ప్రధాని మోదీకి సూచించాల్సిందిగా రాజ్నాథ్ సింగ్ను విపక్షాలు కోరాయని సమావేశానంతరం
కాంగ్రెస్ నేతల గులాం నబీ ఆజాద్ మాధ్యమ ప్రతినిధులకు తెలిపారు. ‘ఇవాళ దేశం
మొత్తం అమరవీరులకు నివాళులర్పిస్తోంది. దేశ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. యుద్ధ
సమయాలను మినహాయిస్తే 1947 తర్వాత భద్రతా బలగాలపై ఇంతపెద్ద దాడి జరిపి పెద్ద
సంఖ్యలో జవాన్లను బలిగొనడం ఇదే మొదటిసారి. మన భద్రతా బలగాలు – సైన్యం, సీఆర్పీఎఫ్,
స్థానిక పోలీసులందరికీ మేము భరోసాగా నిలుస్తాం. మొత్తం దేశంవారి వెంట ఉంది’ అని
ఆజాద్ చెప్పారు.ఉగ్రవాదంపై పోరులో కేంద్ర ప్రభుత్వానికి బేషరతుగా
మద్దతిస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.