మొహాలీ : కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య సోమవారం జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ను తిలకించిన వారికెవరికైనా క్రికెట్లో ఇలా కూడా జరుగుతుందా…అని ఆశ్చర్యం కలగక మానదు. ఢిల్లీ చివరన 21 బంతుల్లో 21 పరుగులు చేస్తే విజయలక్ష్మి వరిస్తుంది. ఐపీఎల్లోనే కాదు వన్డేలో కూడా ఇదేమంత పెద్ద లక్ష్యం కాదు. ఢిల్లీ విజయం సునాయాసమే అని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆ జట్టు 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పంజాబ్ ఆల్రౌండర్ సామ్ కరన్ హ్యాట్రిక్ తీయడంతో ఢిల్లీ ఎనిమిది పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయింది. ఈ మ్యాచ్ తమకు తీవ్ర నిరుత్సాహం కలిగించిందని ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వాపోయాడు. ఈ ఓటమిని వివరించడానికి తన వద్ద మాటల్లేవని ఆవేదన చెందాడు.