కొత్త ఓటర్ల జాబితాలో తప్పులు లేవని అఫిడవిట్‌ ఇస్తారా?

కొత్త ఓటర్ల జాబితాలో తప్పులు లేవని అఫిడవిట్‌ ఇస్తారా?

న్యూఢిల్లీ : కొత్త ఓటర్ల జాబితాలో తప్పులు లేవని ఎన్నికల సంఘం అఫిడవిట్‌ ఇవ్వగలదా? అని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎస్‌వై ఖురేషీ ప్రశ్నించారు. ఎన్నికల విషయంలో ‘ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం’ అనే అంశంపై ఎన్నికల సంఘం ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తున్న రాహుల్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడానికి బదులు.. ఇసి వాటిపై దర్యాప్తునకు ఆదేశించి ఉండాల్సిందని చెప్పారు. 2010 – 12 మధ్య ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఖురేషి బాధ్యతలు నిర్వహించారు. తాను రచించిన ‘డెమొక్రసీస్‌ హార్ట్‌ల్యాండ్‌’ పుస్తకావిష్కరణ సందర్భంగా పిటిఐకి ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న రాహుల్‌ లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన ఆరోపణలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనని అన్నారు. బీహార్‌లో ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితాల స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)ను నిర్వ హించిన విధానాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. సరైన విధంగా విధులు నిర్వహించక పోవడం వల్ల ఎన్నికల కమిషన్‌ (ఇసి)పై విమర్శలు వస్తుంటే మాజీ కమిషనర్‌గానే కాకుండా భారత పౌరుడిగానూ తాను తీవ్ర వేదనకు గురవుతానని ఖురేషీ అన్నారు. ఎన్నికల విషయంలో ‘ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం’ అనే విషయాలను ఇసి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నిర్ణయాలను ప్రభావితం చేసే అన్ని శక్తులు, ఒత్తిళ్లను ఎదుర్కొనే విధంగా అధికారులు ఉండాలని చెప్పారు. ఎన్నికల కమిషన్‌ ప్రజలు, ప్రతిపక్షాల విశ్వాసాన్ని గెలుచుకునేలా ఉండాలని ఆయన అన్నారు. ప్రతిపక్షాలతో మాట్లాడితేనే చాలా సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. తాను ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలోనూ ప్రతిపక్షాలు తనను కలవడానికి వస్తే తప్పకుండా వారి వాదనలు వినేవాడినని, తన సిబ్బందికి కూడా అదేవిధమైన ఆదేశాలిచ్చానని గుర్తుచేశారు. ‘ఎన్నికల సమయంలో తీసుకొస్తున్న కొత్త ఓటర్ల జాబితాలో కూడా ఎటువంటి తప్పులు లేవని అఫిడవిట్‌ ఇవ్వగలరా’ అని ఎన్నికల కమిషన్‌ (ఇసి)ను ఖురేషీ ప్రశ్నించారు. ఒకవేళ అందులో తప్పులున్నాయని తేలితే ఎన్నికల అధికారులు సైతం శిక్ష అనుభవించాల్సి వస్తుందని, దానికి మీరు సిద్ధమేనా అని ఆయన నిలదీశారు. ఖురేషీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ స్పందిస్తూ.. రాజకీయ పార్టీలతో తాము క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఇంత నిర్మాణాత్మక పద్ధతిలో మరెక్కడా సమావేశాలు జరగవని పేర్కొంది. 23 ప్రతిపక్ష పార్టీలు తమకు ఇసి అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని, ఎవరూ తమ మాట వినడం లేదని సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తుండగా, ఇసి ఈ విధంగా సమాధానం ఇవ్వడం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos