విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ ను ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఖండించిన సంగతి తెలిసిందే. నోటీసులు ఇవ్వకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం సరికాదని పురందేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ అంశంలో ప్రొసీజర్ ఫాలో కాలేదని ఆరోపించారు. దీనిపై వైసీపీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా తీవ్రంగా స్పందించింది. “మీరెందుకు అంత బాధపడి పోతున్నారు… మీ బావగారనా?” అంటూ కౌంటర్ ఇచ్చింది. “ఇంతకీ మీరు రాష్ట్రాధ్యక్షురాలిగా ఉన్నది ఏపీ బీజేపీకా లేక తెలుగుదేశం పార్టీకా? వందల కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే, దానిపై మీ స్పందన చూసిన వారెవరికైనా ఇలాంటి సందేహమే కలుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు ఏ1 నిందితుడు. ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అందుకే అరెస్ట్ చేశారు. మీకెందుకు బాధ!” అంటూ వైసీపీ ఘాటుగా విమర్శించింది.