ముంబై: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు నియంత పాలనను ప్రజలు తిరస్కరించారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, లోక్సభ సభ్యురాలు సుప్రియా సూలే అన్నారు. ఇటీవల ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగు స్థానాలను INDIA కూటమి గెలుచుకోవడంపై ఆమె స్పందించారు. INDIA కూటమి పార్టీల అభ్యర్థులకు ఓటేసి గెలిపించిన ప్రజలకు సుప్రియా సూలే కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం పెరుగుదలకు వ్యతిరేకంగా ఓటేశారని, బీజేపీ నియంతృత్వ పాలనను తిరస్కరించారని ఆమె వ్యాఖ్యానించారు. అదేవిధంగా మహారాష్ట్రలో కరువు పరిస్థితులు, మరాఠా రిజర్వేషన్లపై చర్చించేందుకు తక్షణమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని మహా సర్కారును డిమాండ్ చేశారు.