ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్నిఎత్తేసి పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ తీసుకున్ననిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది.విపక్షాలకు మేధావులు సైతం స్వరం కలపడంతో దీనిపై వివాదం రాజుకుంటోంది.ఈ నేపథ్యంలో ఇదే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు గుప్పించిన జనసేన అధినేత పవన్కళ్యాణ్ తాజాగా మరోసారి విమర్శలు చేశారు.తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు మీడియాను నడుపుతూ, తెలుగును చంపేయాలన్న ఆలోచన భస్మాసుర హస్తాన్ని సూచిస్తోందంటూ సీఎం జగన్పై మండిపడ్డారు. మాతృ భాషను మృత భాషగా మార్చకండని అన్నారు.ఇంగ్లీషు భాష వద్దని ఎవరూ చెప్పడం లేదని… కానీ, తెలుగును మృత భాషగా కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో ముఖ్యమంత్రి చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. మాతృ భాషను, మన మాండలికాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని అన్నారు. ‘జగన్ రెడ్డి గారు, ‘మా తెలుగు తల్లికి‘ అంటూ పాడాల్సిన మీరు… తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారు‘ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా సరస్వతి దేవి ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.దీంతో పాటు, పలు పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్ట్ చేశారు.