అమరావతి: నిబంధనల ప్రకారమే తాను ఎన్టీఆర్ ను సభా కార్యకలాపాల సలహా సమితి సమావేశాని(బీఏసీ)కి ఆహ్వానించలేదని శాసనసభ మాజీ సభాపతి యనమల రామకృష్ణుడు తెలిపారు. మంగళ వారం ఇక్కడ శాసనసభ ఆవరణలో విలేఖరులతో మాట్లాడారు. పార్టీ చీలిక సమయంలో లోపల జరిగిన పరిణామాలకు, వెలువడిన వార్తల మధ్య పొంతన లేదని చెప్పారు. ‘అప్పుడు ఎన్టీఆర్ తనను బీఏసీ సమావేశానికి ఎందుకు పిలవలేదు అని అడిగారు. అప్పటికే చంద్ర బాబు నాయుడును శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. అందువల్ల చంద్ర బాబు నాయుడును మాత్రమే బీఏసీకి పిలిచినట్లు ఎన్టీఆర్ కు వివరించాను. సభలో దీని గురించి మాట్లాడతానని ఎన్టీఆర్ పట్టు బట్టారు. నిబంధనల ప్రకారం దాని గురించి మాట్లాడ రాదు. అందుకే నేను అంగీకరించలేదు. మిగిలిన విషయాల గురించి మాట్లాడవచ్చని ఎన్టీఆర్ కు చెప్పాను. తాను దాని గురించి మినహాయించి ఏ విషయాన్ని సభలో ప్రస్తావించనని వెళ్లిపోయార’ని విపులీకరించారు.