జగన్‌ను కలిసిన యలహంక ఎమ్మెల్యే

జగన్‌ను కలిసిన యలహంక ఎమ్మెల్యే

బెంగళూరు : కర్ణాటక భక్తుల కోసం తిరుమలలో యాత్రికుల వసతి గృహాలను నిర్మించడానికి ఎదురవుతున్న అవరోధాలను తొలగించాల్సిందిగా బెంగళూరు యలహంక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజకీయ కార్యదర్శి ఎస్ఆర్. విశ్వనాథ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అమరావతిలో బుధవారం విశ్వనాథ్, జగన్‌తో భేటీ అయ్యారు. వసతి గృహాల నిర్మాణంలో కర్ణాటక ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. తిరుమలలో కర్ణాటక సర్కారుకు ఏడున్నర ఎకరాల భూమి ఉంది. అందులో రూ.20 కోట్ల వ్యయంతో ధర్మ సత్రాలు నిర్మించాలని నిర్ణయించింది. తద్వారా నిత్యం శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వెళ్లే కర్ణాటక భక్తులకు వసతి సదుపాయం కల్పించాలని భావిస్తోంది. భూమి విషయంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కర్ణాటక ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును వెలువరించిందని విశ్వనాథ్ తెలిపారు. ఈ నేపథ్యంలో వసతి గృహాల నిర్మాణానికి ఎదురవుతున్న అవరోధాలను తొలగించడంతో పాటు అవసరమైన అనుమతులు మంజూరు చేయాల్సిందిగా దేవాదాయ శాఖకు, తితిదే ధర్మకర్తల మండలికి సూచనలివ్వాల్సిందిగా విశ్వనాథ్, జగన్మోహన్ రెడ్డిని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos