లఖ్నవ్: ఉన్నావో అత్యాచార బాధితురాలి హత్యను నిరసిస్తూ సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ శాసనసభ ఎదుట శనివారం ధర్నాకు దిగారు. ఆయనతో పాటు పలువురు నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన చరిత్రలో ఇది ఒక ‘చీకటి రోజ’ని అభివర్ణించారు. భాజపా అధికారంలోకి వచ్చాక ఇలాంటి ఘటనలు అధికమై పోయాయని ఆరోపించారు. అమ్మాయిల జీవితాలను వారు కాపాడలేకపోయిన ఆదిత్యనాథ్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ‘శోక సభలు’ నిర్వహిస్తామని ప్రకటించారు.