వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇప్పటినుంచే విహారయాత్రలకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.ఎండలు ముదురుతుండడంతో కుటుంబాలు,స్నేహితులతో కలసి చల్లనైన పర్యాటక ప్రాంతాలు చుట్టి రావడానికి ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా కూడా అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు కలిగిఉన్న రాచనగరి మైసూరు నగరం,జిల్లాలో ఉన్న పర్యాటకప్రాంతాలు రారమ్మని ప్రజలకు స్వాగతం పలుకుతున్నాయి.దీంతో జిల్లాతో పాటు నగరం చుట్టుపక్కల ఉన్న జలపాతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పురాతన స్మారక కట్టడాలను పక్కన పెట్టి జలకాలాటల్లో సయ్యాట ఆడేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఆహ్లాదకర వాతావరణ పరిస్థితుల మధ్య వారంతపు విహారం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తుంటారు. ఈ క్రమంలో మైసూరు చుట్టుపక్కల ఉన్న ఐదు ప్రధాన జలపాతాల గురించి తెలుసుకుందాం. చెలవర, చుంచనకట్టె, మల్లాలి, శివసముద్ర, చుంచి జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
చెలవర జలపాతం..
మైసూర్ నుంచి 125 కిలోమీటర్లు, విరాజ్పేట నుంచి 20 కిలోమీటర్ల దూరంలో చెయ్యందనే గ్రామానికి సమీపంలో ఉన్న చెలవర జలపాతం ఉంది. అత్యంత అందమైన జలపాతాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు. స్థానిక పర్యాటకులకు మాత్రమే ప్రాచుర్యం పొందింది. జలపాతం బేస్ వద్ద ఏర్పడిన చెరువు వర్షాకాలంలో అంచు వరకు నిండిపోతుంది. ఫలితంగా అందులో స్నానం చేయడం ప్రమాదకరంగా ఉంటుంది. ఇప్పటి వరకు సుమారు 15 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. స్నానం కోసం చెరువులోకి అడుగు పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం.
చుంచనకట్టే జలపాతం..
మైసూరు నుంచి 56 కిలోమీటర్ల దూరంలో కావేరి నదిపై చుంచనకట్టే అనే అందమైన జలపాతం ఉంది. ప్రతి ప్రయాణికుడు తప్పక చూడాల్సిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. సహజ సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక ప్రకాశం కారణంగా రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తారు. సమీపంలోనే కోదండ రామాలయం ఉంది. చుంచనకట్టే జలపాతం నీటిలో ఓవైపు ప్రశాంతంగా స్నానం చేయవచ్చు. మరోవైపు కోదండ రామాలయ దైవిక వాతావరణంలో కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు.
మల్లాలి జలపాతం..
మైసూరు నుంచి 135 కిలోమీటర్ల దూరంలో మల్లాలి జలపాతం కుమారధార నదిలో కలిసిపోయి ఉంటుంది. రాతి భూభాగాలు, పశ్చిమ కనుమల పచ్చని వృక్షాలను కిందకు దింపి ఫొటోజెనిక్ ఫ్రేమ్ను ఏర్పరుస్తుంది. ఫలితంగా ప్రకృతి ప్రేమికులు ఆసక్తి చూపిస్తారు. ఈ ప్రాంతంలోని ఎల్తైన జలపాతాల్లో ఇది ఒకటిగా ఉంది. అన్ని వయస్సుల వారికి అనుకూలంగా ఉంటుంది.
శివనసముద్ర జలపాతం..
మైసూరు నుంచి 78 కిలోమీటర్ల దూరంలో కావేరి నదిపై అందమైన శివనసముద్ర జలపాతం ఉంది. ఇది రెండు జలపాతాలుగా విడిపోతుంది. అవి పశ్చిమాన గగనాచుక్కి, తూర్పున భరచుక్కి జలపాతం. ఎక్కువ పొడవు ఉండటంతో ఏడాది పొడవునా పర్యాటకులతో రద్దీగా ఉంటుంది.
చుంచి జలపాతం..
మైసూరు నుంచి 102 కిలోమీటర్ల దూరంలో ఆర్కావతి నదిపై ఉంది. రాముడు తన ప్రవాసంలో బస చేసిన మరో ప్రదేశంగా భావిస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో వారంతపు సెలవుల్లో విహరించేందుకు సరైన ప్రదేశం. దట్టమైన అడవులు, పచ్చని వృక్షసంపదతో కూడిన వాతావరణంలో ఆనందంగా గడపవచ్చు.