హోసూరు : తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని హోసూరు, ఈరోడ్ జిల్లాలోని సత్యమంగలం, ఊటీ తదితర ప్రాంతాలు ఎప్పటికైనా కర్ణాటక రాష్ట్రంలో విలీనం కాక తప్పదని కన్నడ చళువళి (వాటాళ్ పక్ష) నాయకుడు వాటాళ్ నాగరాజ్ స్పష్టం చేశారు. కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులోని బెల్గాంను మహారాష్ట్రలో విలీనం చేయాలని శివసేv నాయకులు బెల్గాం ప్రాంతంలో చిచ్చుపెడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నారని వాటాళ్ మండిపడ్డారు. బెల్గాంను మహారాష్ట్రలో విలీనం చేయాలన్న శివసేన నాయకుల డిమాండ్ను ఖండిస్తూ, తమిళనాడు-కర్ణాటక సరిహద్దు అత్తిపల్లి వద్ద వాటాళ్ నేతృత్వంలో కన్నడ సంఘాలకు చెందిన నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కర్ణాటక పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే హోసూరు, సత్యమంగలం, ఊటీ ప్రాంతాలను కర్ణాటక
వదులుకోవాల్సి వచ్చిందని నిష్టూరమాడారు. దీనివల్లే ప్రస్తుతం బెల్గాం సమస్య తెరపైకి వచ్చిందని అన్నారు. మహారాష్ట్రలో బెల్గాంను విలీనం చేయాలనుకుంటున్న శివసేన నాయకుల కుట్రలు ఎప్పటికీ ఫలించబోవని కుండ బద్ధలు కొట్టారు. దేవుడే దిగివచ్చినా కర్ణాటక నుంచి బెల్గాంను విడదీయలేరని అన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు, సత్యమంగలం, ఊటీ ప్రాంతాలను కర్ణాటక రాష్ట్రంలో విలీనం చేయడానికి త్వరలో కార్యాచరణను ప్రకటిస్తామని వాటాళ్ ఈ సందర్భంగా వెల్లడించారు. అనంతరం పోలీసులు వాటాళ్తో పాటు కన్నడ సంఘాల నాయకులను అరెస్టు చేశారు.