మెల్బోర్న్: కరోనా వైరస్ (కొవిడ్ 19) విజృంభిస్తున్నా టోక్యో ఒలింపిక్స్ నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ)పై ఒత్తిడి పెరుగుతోంది. ఆదివారం కెనడా తమ అథ్లెట్లను టోక్యోకు పంపించబోమని తేల్చి చెప్పిన కొద్ది గంటలకే ఆస్ట్రేలియా సైతం అదే నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని తమ బృందాలను ఒలింపిక్స్కు పంపించలేమని పేర్కొంది. తాజా పరిస్థితులపై ఐఓసీ సూచనల కోసం వేచి చూడకుండానే తాము నిర్ణయం తీసుకున్నామని ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీ చీఫ్ మ్యాట్ కారల్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, తుది నిర్ణయం తీసుకోడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఇంకా సమాలోచనలు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు జపాన్ ప్రధాని షింజో అబె సోమవారం తొలిసారి ఒలింపిక్స్ వాయిదాపై స్పందించారు. అనుకున్న తేదీల్లో మెగా ఈవెంట్ను నిర్వహించడం కుదరకపోతే వాయిదా వేసుకోవాలని సూచించారు. ఒలింపిక్స్ను వాయిదా వేయాలని గత 48 గంటల్లో తీవ్ర ఒత్తిడి పెరిగింది. పలు దేశాల కమిటీలతో పాటు ప్రధాన స్టేక్హోల్డర్లు సైతం వాయిదా వేయాలని ఐఓసీని కోరుతున్నాయి. కాగా, వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 14 వేల మంది మృతిచెందారు.