టోక్యో : ఈ ఏడాది జూన్లో జరగాల్సిన ఒలింపిక్స్ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు ఆతిథ్య జపాన్ ప్రధాని షింజో అబె మంగళవారం వెల్లడించారు. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్తో మాట్లాడిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ను ఏడాది పాటు వాయిదా వేసే విషయమై తమ ఉభయుల మధ్య జరిగిన చర్చల సందర్భంగా అంగీకారానికి వచ్చినట్లు చెప్పారు. క్రీడాకారులు అత్యుత్తమ పరిస్థితుల్లో ఆడడానికి అనువుగా ఒలింపిక్స్ను ఏడాది పాటు వాయిదా వేసే విషయాన్ని పరిశీలించాల్సిందిగా బాచ్ను కోరామన్నారు. ప్రేక్షకుల రక్షణ, భద్రత విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉందని గుర్తు చేశామన్నారు. టోక్యో గవర్నర్ యురికో కొయికె మరో పక్క విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఏడాది వేసవిలో ఒలింపిక్స్ను నిర్వహిస్తామని, అయినప్పటికీ దీనిని టోక్యో 2020 బ్రాండ్గానే వ్యవహరిస్తామని చెప్పారు. కరోనా వైరస్ ప్రపంచమంతటా వ్యాపించడానికి ముందే టోక్యోలో ఒలింపిక్స్ నిర్వహణకు సన్నాహాలు పూర్తయ్యాయి.