అంతర్జాతీయ క్రికెట్లో మరి కాసేపట్లో చారిత్రాత్మక ఘట్టానికి తెర లేవనుంది.భారత్–బంగ్లాదేశ్ మధ్య కాసేపట్లో డే/నైట్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ చూసేందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కోల్ కతా చేరుకున్నారు.సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆమె ఈడెన్ గార్డెన్స్ చేరుకున్నారు.ఈ మ్యాచ్ చూసేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రానున్నారు. అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ మ్యాచ్ ప్రారంభానికి వచ్చే అవకాశం ఉంది. ఈడెన్ గార్డెన్లో నేటి నుంచి ఈ నెల 26 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. కాసేపట్లో టాస్ వేయనున్నారు.పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ప్రధాని మోదీని కూడా ఈ మ్యాచ్ కు ఆహ్వానించింది. రాజకీయ ప్రముఖులతో పాటు షూటర్ అభినవ్ బింద్రా, బాక్సర్ మేరీకోమ్, షట్లర్ పీవీ సింధు కూడా హాజరుకానున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్లు కూడా స్టేడియంలో సందడి చేయనున్నారు.ఈ పింక్ టెస్టును చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకునేలా బీసీసీఐ అన్ని హంగులను సిద్ధం చేసింది. స్టేడియానికి పరిసరాల్లో ఉన్న రోడ్లను అందమైన గ్రాఫిటీలతో ముస్తాబు చేసింది. అక్కడి పరిసరాలన్నీ గులాబీ రంగులతో మెరిసిపోతున్నాయి.