కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడులో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది.భారీ వర్షాల కారణంగా కోయంబత్తూరు నగరంలోని మెట్టుపాళ్యంలో నాలుగు భవనాలు కూలి 15 మంది మృతి చెందారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఈ భవనాలు ఒక్కసారిగా కుప్పకూలినట్టు తెలుస్తోంది.ప్రమాద సమయంలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.వర్షాల కారణంగా చాలా జిల్లాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నివాస ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.14 జిల్లాల్లో 53 చోట్ల 10 సె.మీకి పైగానే వర్షం కురిసింది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో అధికార యంత్రాంగం ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది.