స్వప్న సురేశ్‌కు ఊరట

స్వప్న సురేశ్‌కు ఊరట

కొచ్చి : బంగారం అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ను సుదీర్ఘకాలం నిర్బంధంలో కొనసాగించడాన్ని ఉన్నత న్యాయస్థానం శుక్రవారం రద్దు చేసింది. ఆమె తల్లి దాఖలు చేసిన పిటిషన్పై ఈ ఆదేశాలిచ్చింది. కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్ ప్రకారం ఆమెను నిర్బంధంలో ఉంచారు. ‘కాఫ్పొస ’ నియమావళి ప్రకారం స్వప్న సురేశ్ను నిర్బంధంలో ఉంచడాన్ని సమర్థించేందుకు తగిన సాక్ష్యాధారాలు లేవని న్యాయమూర్తులు ఏకే జయశంకర్ నంబియార్, మహమ్మద్ నియాస్ సీపీ ధర్మాసనం పేర్కొంది. తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి ఉద్దేశించిన పెట్టెలో వచ్చిన 30 కేజీల బంగారాన్ని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో స్వప్న సురేశ్ ప్రధాన నిందితురాలు. ఆమెను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గత ఏడాది జూలైలో అరెస్టు చేసింది. మరో అనుమానితుడు రషీద్ ఖమిస్ అల్ షీమెయిలీని యూఏఈ ప్రభుత్వం రీకాల్ చేసింది. రషీద్ తరపున స్వప్న సురేశ్ పని చేశారని ఎన్ఐఏ ఆరోపించింది. రషీద్ గత ఏడాది జూలై 16న భారత దేశం నుంచి వెళ్ళిపోయారు. రషీద్ దౌత్య ప్రతినిధి అయినందున భారత దేశ నేర పరిధి నుంచి ఆయనకు మినహాయింపు ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos