రాంచి : వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా మళ్లీ గాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో అతడి వేలికి గాయమైంది. సఫారీల ఫాలోఆన్లో 26.1వ బంతిని అశ్విన్ విసిరాడు. పిచ్ అయిన బంతి అనూహ్య రీతిలో బౌన్స్ అయింది. బ్యాట్స్మన్ లిండె దానిని ఆడలేకపోయాడు. బౌన్సును ఊహించలేకపోయిన సాహా బంతిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా అతడి చేతి వేళ్ల కొసలకు తగిలింది. వెంటనే గ్లోవ్స్ విప్పి చూసుకున్నాడు. ఫిజియో వచ్చి గాయాన్ని పరిశీలించి అతడిని బయటకు తీసుకెళ్లాడు. దీంతో కీపర్ రిషభ్ పంత్ కీపింగుకు వచ్చాడు. గతంలో ఒక కీపర్ బదులు మరో కీపర్ సబ్స్టిట్యూట్గా వచ్చే అవకాశం లేదు. ఐసీసీ కొత్త నిబంధన వల్ల ఈ మార్పు సాధ్యమైంది. ఫాలోఆన్లో 30 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 75/6తో నిలిచింది. అశ్విన్ వేసిన 28.3వ బంతిని ఆడిన జార్జ్ లిండె (27; 55 బంతుల్లో 5×4) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.