చెన్నై: తమిళనాడు అసెంబ్లీ లో శనివారం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ఆ తీర్మానాన్ని తీసుకువచ్చారు. గతంలో ఆమోదం పొందిన సుమారు 10 బిల్లలను పాస్ చేసే విధంగా రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి చర్యలు తీసుకోవాలని ఆ తీర్మానంలో సీఎం స్టాలిన్ కోరారు. ఎటువంటి కారణాలు లేకుండానే గవర్నర్ రవి తమ అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను తిప్పి పంపినట్లు స్టాలిన్ ఆరోపించారు. 2020, 2023లో రెండు బిల్లులకు ఆమోదం దక్కిందని, మరో ఆరు బిల్లులు గత ఏడాది పాస్ చేశామని, కానీ ఇంత వరకు గవర్నర్ ఆ బిల్లులకు ఓకే చెప్పలేదని స్టాలిన్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ ప్రకారం ఆ బిల్లులను మళ్లీ పాస్ చేశామని, తమిళనాడు అసెంబ్లీ రూల్ 143 ప్రకారం కూడా బిల్లులకు ఆమోదం దక్కిందని స్టాలిన్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను గవర్నర్ రవి అడ్డుకుంటున్నట్లు సీఎం స్టాలిన్ ఆరోపించారు. వ్యక్తిగత కారణాలతో గవర్నర్ తమ బిల్లులను వెనక్కి పంపారని, ఇది అప్రజాస్వామికమని సీఎం అన్నారు.నాన్ బీజేపీ రాష్ట్రాలను కేంద్రం కావాలనే టార్గెట్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఒకవేళ ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తిక చేసుకోవాలని, కానీ ఆ బిల్లులకు ఆమోదం ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు. అసెంబ్లీని, ప్రజల్ని గవర్నర్ రవి అవమానిస్తు న్నట్లు తెలిపారు.