న్యూ ఢిల్లీ: పెగసస్పై మరో ప్రమాణ పత్రాన్ని సమర్పించలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదన్నదే తమ అభిప్రాయమని పేర్కొంది. తాము దేశ భద్రత, శాంతిభద్రతల అంశాల్లోకి వెళ్లడం లేదని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పేర్కొన్నారు. పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో స్పష్టం చేస్తే చాలని చెప్పారు. పెగసస్ స్పైవేర్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిపుణుల కమిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సోలిసిటర్ జరనల్ తెలిపారు. స్వతంత్ర సమితి అన్నీ పరిశీలించి నివేదిస్తుందన్నారు. పెగసస్ అంశం అత్యంత ముఖ్యమైనదేనన్నారు. అయితే తాము దేశభద్రత, శాంతిభద్రతల అంశాల్లోకి వెళ్లడం లేదని ఎన్వీ రమణ స్పష్టం చేశారు. డిఫెన్స్ తదితర విషయాలు అడగట్లేదని, కేంద్రం పదే పదే అవే అంశాలను ప్రస్తావిస్తోందని అసహనాన్ని వ్యక్తం చేశారు. పెగసస్ అంశం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయమని, పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో స్పష్టం చేస్తే చాలని చెప్పారు. గోప్యతా హక్కుల ఉల్లంఘన ఆరోపణలకే పరిమితం కావాలన్నారు. అయితే పెగసస్పై కేంద్రం ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్ సరిపోతుందని, సవివవరంగా మరో అఫిడవిట్ను సమర్పించలేమని కేంద్రం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.ఒక ప్రకటన చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చామని, కారణం ఏమైనా.. ప్రకటన చేయ డానికి కేంద్రం ఇష్టపడట్లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాలో ఆలోచించి జారీ చేస్తా మని పేర్కొంది.