న్యూఢిల్లీ : తీవ్రమైన నేరాలకు పాల్పడిన నేతలను ఎన్నికలలో పోటీచేయకుండా నిషేధించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు చేసింది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నేతలపై దాఖలైన కేసుల విచారణకు మార్గదర్శకాలను సూచించింది. ప్రజా ప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసులను త్వరిత గతిన విచారించాలని హైకోర్టులకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తీవ్రమైన నేరం విషయంలో ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయకూడదని ధర్మాసనం సూచించింది. కేసుల సత్వర పరిష్కారానికి వెబ్సైట్ను సిద్ధం చేయాలని ఆదేశించింది. దోషిగా తేలిన ఎంపీ/ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై ఇంకా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిని జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని సుప్రీంలో న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ పిల్ దాఖలు చేశారు.