‘ఉచిత’ హామీలపై కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు

న్యూ ఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో రాజకీయ పక్షాల ఉచిత హామీలపై కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు మంగళ వారం నోటీసులు జారీ చేసింది. ప్రజా ధనంతో నిర్హేతు కమైన ఉచిత పథకాలను అమలు చేస్తున్న రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రెండు రోజుల కిందట అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ వ్యాజ్యాన్ని దాఖలుచేసారు. అలాంటి పార్టీల ఎన్నికల గుర్తును నిలిపివేయాలని, లేదా పార్టీల గుర్తింపును రద్దు చేయాలని కోరారు. దరిమిలా నాలుగు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని కేంద్రం, ఎన్నికల సంఘానికి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు పంపింది. ఓటర్ల మన్నన పొందడం కోసం రాజ్యాంగ నిబంధనలను అతిక్రమిస్తూ అడ్డదారుల్లో అమలు చేస్తున్న ప్రజాకర్షక విధానాలను నిషేధించాలని పిటిషనర్ కోరారు. ఓటర్లను మభ్యపెట్టి అనుచిత లబ్ధి పొంది తద్వారా అధికారంలో కొనసాగేందుకు చేసే ఇటువంటి ప్రయత్నాలు ఎన్నికల పవిత్రతను దెబ్బతీస్తాయని అన్నారు. పోటీ చేసే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఆదర్శానికి విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు. సముచిత నివారణ చర్యలు తీసుకునేలా భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) ఆదేశించాలని విన్నవించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos