ప్రజా వాహిని-బెంగళూరు
కర్నాటకలో చట్ట విరుద్ధంగా ఉపగ్రహ టెలిఫోన్లు కలిగి ఉన్న వారు విదేశాలతోనూ సంభాఫించినట్లు తేలిందని హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర మంగళవారం విధానసభలో తెలిపారు. వాటిపై నిఘా తీవ్రం చేసినట్లు వివరించారు. శూన్యవేళలో కాంగ్రెస్ సభ్యుడు ఖాదర్ ఈ ఫోన్ల గురించి చేసిన ప్రస్తావనకు మంత్రి బదులిచ్చారు. తరచూ కోస్తా తీరంలో ఉపగ్రహ టెలిఫోన్లు వినియోగిస్తున్నారని పత్రికల్ల్లో తరచూ వస్తున్న వార్తలపై స్పష్టీకరణ ఇవ్వాలని కోరారు. ఈ తరహా వార్తల వల్ల కోస్తా వాసులకు మనశ్శాంతి కరువవుతోందని ఆక్రోశించారు. దీనికి మంత్రి సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. ఇంటెలిజన్స్ బ్యూరో, రా, ఇతర నిఘా సంస్థలతో కలసి పోలీసులు రాష్ట్రంలో ఉపగ్రహ టెలిపోన్ల వినియోగాన్ని నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. వీటి ద్వారా నిరుడు 256, ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 250 కాల్స్ చేసారని, కొన్ని విదేశాలకూ వెళ్లాయని వివరించారు. అయితే ప్రస్తుతానికి దేశ భద్రతకు, సగ్రతకు ముప్పు కలిగే సూచనలు లేవని వివరించారు. ముంబై తాజ్ హోటల్ పాక్ పై ఉగ్రవాదుల దాడుల తర్వాత ప్రభుత్వం ఉపగ్రహ టెలిఫోన్ల వినియోగాన్ని నిషేధించిందని చెప్పారు.