విజయ నగరం : తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ పాలన హక్కులు అక్కడి రాజ కుటుంబానికే చెందుతాయని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినందున సింహాచలం బోర్డు, మాన్సాస్ ట్రస్టు సంరక్షకులుగా గజపతి కుటుంబీకుల్ని నియమించాలని తెదేపా నేత అంతకు ముంటు ట్వీట్ చేసారు. ‘నన్ను చైర్ పర్సన్ గా నియ మించడం వల్ల సింహాచలం, మాన్సాస్ ట్రస్టులపై గజపతి కుటుంబ హక్కులు పూర్తిగా సంరక్షింపబడుతున్నాయి చంద్రబాబు గారూ’అని సంచయిత ప్రతి స్పందించారు.‘నేను సంచయిత గజపతిని, నా తండ్రి ఆనంద గజపతికి అన్ని విధాలా న్యాయపరమైన వారసురాలిని. మా తాతగారైన మహారాజా పీవీజీ రాజు గారికి మా తండ్రి ఆనంద గజపతి న్యాయపరమైన వారసుడు, మా తండ్రి ఆనంద గజపతికి నేను వారసురాలిని. చంద్రబాబు గారూ గజపతి కుటుంబం మొత్తానికి తానే వారసుడ్నని చెప్పుకుంటూ అహంభావం చూపుతున్న అశోక్ గజపతిలా కాకుండా, మీరు లింగ సమానత్వంపై గౌరవం చూపుతారని భావిస్తున్నాను. నేను గజపతి కుటుంబానికి చెందిన దాన్నే కాదంటూ అశోక్ గజపతి మిమ్మల్ని తప్పుదోవ పట్టించాడు. ఈ వ్యవహారాలను రాజకీయం చేయకుండా, గజపతి కుటుంబ వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే మిమ్మల్ని తప్పకుండా అభినందిస్తాన’ని పేర్కొన్నారు.